Actor sumalatha: రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న నటి సుమలత?

  • మాండ్యలో అంబరీష్ సంస్మరణ సభ
  • తరలివచ్చిన శాండల్‌వుడ్ ప్రముఖులు
  • సుమలత రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ నినాదాలు

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ నటి సుమలత రాజకీయాల్లో అడుగుపెట్టబోతోందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆదివారం మాండ్య జిల్లాలో నిర్వహించిన భర్త అంబరీష్ సంస్మరణ సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అంబరీష్ సొంత జిల్లా అయిన మాండ్యలో నిర్వహించిన ఈ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, అంబరీష్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నటుడు దర్శన్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, సీనియర్ నటుడు దొడ్డణ్ణతోపాటు పలువురు ప్రముఖులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సుమలత పోటీ చేయాలని కోరారు. వారామాట అనగానే కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. సుమలత రాజకీయాల్లోకి రావాల్సిందేనని నినాదాలు చేశారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే జేడీఎస్‌లో ప్రయత్నించాలని, అక్కడా కుదరకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాదు, ఆమె బరిలోకి దిగితే తాము కలిసికట్టుగా గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఆమె కుమారుడు, నటుడు అభిషేక్ కూడా వారికి మద్దతుగా నిలిచాడు. అమ్మ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని అభిప్రాయపడ్డాడు. వారు మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న సుమలత వారి వ్యాఖ్యలను ఖండించకపోవడంతో ఆమె కూడా రాజకీయాలవైపు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు.

More Telugu News