Vijayawada: ఉత్సాహంగా స్వర్ణభారతి ట్రస్టు వార్షికోత్సవం.. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • నోబెల్‌ గ్రహీత కైలాస్‌ సత్యార్థి, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీష్‌రెడ్డి రాక
  • ఆకట్టుకున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు, గంగిరెద్దు విన్యాసాలు
  • విజేతలకు బహుమతులు అందించిన వెంకయ్యనాయుడు

ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్టు వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, నోబెల్‌ గ్రహీత కైలాస్‌ సత్యార్థి, డీఆర్‌డీఓ చైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి వంటి ప్రముఖులు హాజరు కావడంతో కార్యక్రమానికి నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు బసవతారకం మొబైల్‌ క్యాన్సర్‌ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు.

ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు, సంక్రాంతి ముగ్గుల పోటీలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ప్రదర్శించిన వందేమాతరం, నమామి గంగే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యోగాకు నృత్యాన్ని జోడించి చిన్నారులు ప్రదర్శించిన తీరు అతిథులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

More Telugu News