Revanth Reddy: కేసీఆర్ కుటుంబానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప వేరే పని లేదు: రేవంత్

  • గుడిలో ప్రమాణం చేయాలి
  • కాంట్రాక్టులో కమీషన్ తీసుకోలేదా?
  • కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

నల్గొండ జిల్లా తెలంగాణ పోరాటానికి నాంది పలికిన ఖిల్లా అని.. భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. నేడు ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా చైతన్య సభలో మాట్లాడుతూ.. తాను సత్య హరిశ్చంద్రుడినన్నట్టు ప్రగల్బాలు పలికే కేసీఆర్ ప్రతి కాంట్రాక్టులో 6 శాతం కమీషన్ తీసుకోలేదా? అని ప్రశ్నించారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుండంలో మునిగి గుడిలో ప్రమాణం చేయాలని కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. సవాల్‌ను స్వీకరించకుంటే కమీషన్ తీసుకున్నట్టు ఒప్పుకున్నట్టేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన తరుణం వచ్చిందని.. కాంగ్రెస్‌ను గెలిపించి ఆమెకు బహుమతిగా ఇవ్వాలన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప వేరే పని లేదన్నారు. కేసీఆర్ ఉద్యోగం ఊడితే వంద రోజుల్లో యువతకు లక్ష ఉద్యోగాల కల్పన సాధ్యమేనని రేవంత్ తెలిపారు.

More Telugu News