తెలంగాణ ప్రజల్ని కించపరిచేలా సోనియా ప్రసంగం: మంత్రి హరీష్‌రావు

  • మేడ్చల్‌ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనపై మండిపాటు
  • ఆంధ్రప్రదేశ్‌లో దిక్కులేని చంద్రబాబు ఇక్కడేం చేస్తారని ఎద్దేవా
  • మెదక్‌ టీడీపీ నేతలు రమణ సమక్షంలోనే కాంగ్రెస్‌లో చేరారు 
మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల బహిరంగ సభలో సోనియా గాంధీ మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజల్ని అవమానించే విధంగా ఉందని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. లేదంటే తెలంగాణ సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కిన పాలకులను తెచ్చి తెలంగాణలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్‌ చూస్తోందని ధ్వజమెత్తారు.

ఏపీలోనే దిక్కులేని చంద్రబాబు తెలంగాణలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ సమక్షంలోనే ఆ పార్టీ మెదక్‌ జిల్లా నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అధికారం కోసం అపవిత్ర పొత్తుపెట్టుకున్న మహాకూటమి నేతలకు తీవ్ర పరాభవం తప్పదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కుతంత్రాలు, కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇక్కడే కాదు చంద్రబాబుకు ఏపీలోనూ పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Harish Rao
medchal meeting

More Telugu News