Kinjarapu Acchamnaidu: కూటమి ఉంటుంది కానీ... అధినేత చంద్రబాబు కాదు: అచ్చెన్నాయుడు

  • టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
  • ప్రధాని పదవిపై చంద్రబాబుకు ఆసక్తి లేదు
  • బీజేపీ మోసం చేసిందన్న అచ్చెన్నాయుడు

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఉంటుంది కానీ, దానికి అధినేతగా చంద్రబాబునాయుడు ఉండబోరని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే తప్ప, ప్రధాని పదవి ముఖ్యం కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో తమకు అధికారాన్ని అప్పగించిన ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తున్నామని, బీజేపీకి ప్రత్యామ్నాయంగా మాత్రమే కూటమిని ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే నేడు చంద్రబాబు, రాహుల్ గాంధీల మధ్య చర్చలు జరగనున్నాయని తెలిపారు.

 ఏపీ బాగుండాలనే నాడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరామని, నమ్మించి మోసం చేసినందున విడిపోయామని తెలిపారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసినందునే, ఆ పార్టీకి దగ్గరయ్యామని తెలిపారు. హోదా సాధన రాష్ట్ర ప్రజలందరి కోరికని, చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పలువురు జాతీయ పార్టీల నేతలు కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.

More Telugu News