అమెరికా హెచ్చరికలు బేఖాతరు.. క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం 777 మిలియన్ డాలర్లతో ఇజ్రాయెల్‌తో భారత్ డీల్!

  • ఇజ్రాయెల్‌తో ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ఒప్పందం
  • ఇప్పుడు బరాక్ 8 నేవల్ వెర్షన్ కోసం డీల్
  • ఇండియన్ నేవీ మరింత బలోపేతం
అమెరికా ఆంక్షల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్‌తో భారత్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. భూతలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణుల (ఎల్ఆర్ఎస్ఏఎం) సరఫరా కోసం భారత్ నుంచి 777 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు బుధవారం ఇజ్రాయెల్ ప్రకటించింది. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టం బరాక్8కు ఇవి నేవల్ వెర్షన్ అని తెలిపింది.

ఈ క్షిపణులు కనుక భారత అమ్ములపొదిలోకి చేరితే భారత నేవీ మరింత బలోపేతం అవుతుందని డైరెక్టర్, సొసైటీ ఫర్ స్టడీస్ కమోడర్ సి.ఉదయ్ భాస్కర్ (రిటైర్డ్) తెలిపారు. ఈ క్షిపణి వ్యవస్థను ఏడు నౌకలకు అమర్చవచ్చని వివరించారు.

రాఫెల్ డీల్ విమర్శల నేపథ్యంలో ఈ ఒప్పందంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)ను ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో చేర్చింది.

ఆయుధాల సరఫరాలో ఇజ్రాయెల్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానం ఇజ్రాయెల్‌దే. ఇండియన్ మిలటరీ నుంచి ఇజ్రాయెల్ ఇప్పటికే ఓ ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది ఏప్రిల్‌లో 2 బిలియన్ డాలర్లతో అడ్వాన్స్‌డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్ల కోసం భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ఏఎం కోసం రెండో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
Go Back to Shorts
Barak 8
Israel
India
America
missile defence system
Israel Aerospace Industries

More Telugu News