Bihar: మసాజ్ చేయించుకుంటూ ఫిర్యాదు స్వీకరిస్తున్న ఏఎస్సై.. పరువు తీశాడంటూ వేటు!

  • పోలీస్ స్టేషన్‌లో బాడీ మసాజ్
  • బూతులు తిడుతూ ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్సై
  • సస్పెన్షన్ వేటేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌లో బాడీ మసాజ్ చేయించుకుంటూ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)పై వేటుపడింది. అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. మసాజ్ చేయించుకుంటూ, ఫిర్యాదుదారులను బూతులు తిడుతున్న ఏఎస్సై వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.  

ఏఎస్సై వెనక నిలబడిన ఓ వ్యక్తి అతనికి మసాజ్ చేస్తుంటే అతడు నిర్లక్ష్యంగా బాధితుల ఫిర్యాదు వింటున్నాడు. అంతేకాక, మధ్యమధ్యలో వారిని బూతులు తిడుతుండడం కూడా వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో దీనినే ఫిర్యాదుగా స్వీకరించిన అధికారులు దర్యాప్తు జరిపారు. ఏఎస్సైని జాఫర్ ఇమామ్‌గా గుర్తించిన కూమూర్ ఎస్పీ అతడిని సస్పెండ్ చేశారు. ఏఎస్సై తన తీరుతో పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చారని డీఎస్పీ అజయ్ ప్రసాద్ పేర్కొన్నారు.

More Telugu News