Kerala: హెల్మెట్ ఏదీ?.. అంటూ సైకిల్‌పై వెళుతున్న వ్యక్తికి రూ.2 వేల జరిమానా విధించిన పోలీసులు!

  • ఉత్తరప్రదేశ్ వలస కూలీకి కేరళలో చేదు అనుభవం
  • రూ.500 కట్టే వరకు వదిలిపెట్టని పోలీసులు
  • ఎస్పీ సీరియస్.. విచారణకు ఆదేశం

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి. అది లేకుండా బండెక్కితే భారీ జరిమానా తప్పదు. అయితే, ఈ నిబంధన ద్విచక్ర వాహనదారులకు మాత్రమే కాదు.. సైకిలిస్టులకూ వర్తిస్తుంటూ ఓ వ్యక్తికి ఏకంగా రూ.2 వేల జరిమానా విధించారు కేరళ పోలీసులు. అంతమొత్తం తన దగ్గర లేదని ఆ అభాగ్యుడు మొరపెట్టుకోవడంతో కనికరించిన పోలీసులు చివరికి రూ.500 కట్టించుకున్నారు. కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిలుపై వెళ్తుండగా అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల జరిమానా విధించారు. అక్కడితో ఆగక సైకిలు టైర్లలోని గాలిని తొలగించారు. ఖాసింకు ఇచ్చిన చలానా రసీదుపై ఓ మహిళకు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో అవాక్కైన ఖాసిం తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. రూ.500 కట్టే వరకు పోలీసులు తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అది కాస్తా వైరల్ అయి ఎస్పీ దృష్టికి చేరింది. తీవ్రంగా పరిగణించిన ఆయన విచారణకు ఆదేశించారు.  

More Telugu News