aarogya sri: ‘ఆరోగ్య శ్రీ’ గురించి జగన్ ప్రసంగిస్తుండగా అటుగా వచ్చిన ‘అంబులెన్స్’!

  • అంబులెన్స్ పోవడానికి దారి లేదని కనిపిస్తూనే ఉంది
  • వేరే దారిలో పోకుండా.. ఇదే దారిలోనే పోతోంది
  • ‘ఇంతకన్నా సిగ్గులేని ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా?
  • వ్యంగ్యాస్త్రాలు సంధించిన  జగన్
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న గుర్లలో జరుగుతున్న బహిరంగ సభలో ‘ఆరోగ్య శ్రీ’ గురించి జగన్ ప్రసంగిస్తుండగా అంబులెన్స్ వచ్చింది. కిక్కిరిసి ఉన్న బహిరంగ సభ వద్దకు అంబులెన్స్ రావడంపై జగన్ విమర్శలు గుప్పించారు. మనం మాట్లాడే మాటలు వింటున్నారు కనుకనే, ‘అంబులెన్స్’ ఇంకా బతికే ఉందని చూపించడం కోసం దీనిని ఇటువైపు పంపించారని అన్నారు.

ఇక్కడ రోడ్డు లేకపోయినప్పటికీ ఈ జనంలో నుంచి అంబులెన్స్ ను తీసుకువెళ్లాలని చూస్తున్నారంటే. ‘ఇంతకన్నా సిగ్గులేని ప్రభుత్వం, ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అయ్యా, చంద్రబాబునాయుడుగారు, నీకు సిగ్గులేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. బండి పోవడానికి దారి లేదని కనిపిస్తూనే ఉంది.. వేరే దారిలో పోకుండా.. ఇదే దారిలోనే పోతోంది’ అని మండిపడ్డారు.

‘వాళ్లు ఏ నికృష్టపు ఆలోచనతో చేసినా.. మనమైతే మంచే చేద్దాం..దారివ్వండి .. కొద్దిగా దారివ్వండి’ అంటూ అంబులెన్స్ కు వెంటనే దారి ఇవ్వాలని సభకు హాజరైన ప్రజలను, తమ కార్యకర్తలను జగన్ కోరారు. ‘అందులో పేషెంట్ ఎవరూ లేరన్న సంగతి అందరికీ తెలుసు.. రానీ..రానీ’ అని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో నవ్వులు కురిశాయి.

‘ఆరోగ్యశ్రీ’ గురించి చేసిన వ్యాఖ్యలకు ఇది వికృత చర్య, మీ అందరి తరపున చంద్రబాబునాయుడుగారిని నేను ప్రశ్నిస్తున్నా.. మూగ, చెవుడు ఉన్న పిల్లల పరిస్థితి ఎలా ఉందో, నీ దిక్కుమాలిన బుర్రలో ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఈ పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ కోసం వెళితే సాకులు వెతుకుతున్నారు’ అని మండిపడ్డారు.
aarogya sri
jagan
Vijayanagaram District

More Telugu News