New Delhi: కొత్త ప్రియుడి మోజులో, పాత ప్రియుడిని హత్య చేయించిన యువతి!

  • ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ సమీపంలో హత్య
  • కేసును ఛేదించిన పోలీసులు
  • ప్రేయసి, ఆమె ప్రియుడు అరెస్ట్

ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ సమీపంలో జరిగిన హత్య వెనకున్న కుట్రను పోలీసులు ఛేదించారు. కొత్త ప్రియుడు దోరికాడన్న కారణంతో, పాత ప్రియుడిని ఓ యువతి హత్య చేయించిందని పోలీసులు తేల్చారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వివరాలను మీడియాకు వెల్లడించారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో 30 ఏళ్ల యువకుని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం రాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతను భరత్ విహార్ ప్రాంతానికి చెందిన రాజారాంగా గుర్తించి కేసును విచారించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లు, మృతుడి కాల్ రికార్డులను పరిశీలించిన అనంతరం, అతని ప్రియురాలు అనితను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె చెప్పిన వాస్తవాలను విని విస్తుపోయారు.

తనకు రెండున్నరేళ్ల నుంచి రాజారాం పరిచయమని, ఆపై కిరణ్ అనే మరో యువకుడు పరిచయం అయ్యాడని వెల్లడించిన ఆమె, ఆపై రాజారాంను దూరం పెడుతూ వచ్చానని పోలీసులకు తెలిపింది. అయితే, అనితతోనే ఉండాలని భావించిన రాజారాం, ఆమెపై ఒత్తిడి తెస్తూ వచ్చాడు. దీంతో కరణ్ సాయంతో రాజారాంను కడతేర్చాలని అనిత భావించింది. రాజారాంను ఓ పార్కు వద్దకు రమ్మని పథకం ప్రకారం హత్య చేయించింది. ఈ కేసులో ప్రేయసీ ప్రియులను అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

More Telugu News