జగిత్యాలలో ఘోరం.. ప్రేమ కోసం పోటీ.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న పదో తరగతి విద్యార్థులు!

  • అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ పడిన విద్యార్థులు
  • పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థులు
  • ఇద్దరూ మృతి..
తెలిసీ తెలియని వయసులో ప్రేమ కోసం జరిగిన గొడవలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాలలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే మహేందర్, రవితేజ అనే విద్యార్థులు ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు. ఒకే అమ్మాయిని ఇద్దరూ ప్రేమించడంతో వీరిద్దరి మధ్య తరచు గొడవలు జరిగేవి.

ఆదివారం రాత్రి స్నేహితులు ఇద్దరూ కలిసి ఓ కల్లు కాంపౌండ్‌కు వెళ్లి కల్లు తాగారు. అనంతరం ఇద్దరి మధ్య మరోమారు అమ్మాయి విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. క్షణికావేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. మహేందర్ అక్కడికక్కడే చనిపోగా, రవితేజ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

కాగా, ఘటన జరిగిన సమయంలో మరో యువకుడు కూడా వారితో ఉన్నట్టు, వారు నిప్పంటించుకోగానే అతడు పారిపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ కేసులో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారికి  పెట్రోలు ఎక్కడి నుంచి వచ్చింది? వారే నిప్పంటించుకున్నారా? లేక, మరెవరైనా ఆ పనిచేశారా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Telangana
Jagityal
Love
Students
Petrol
Ablaze

More Telugu News