motkupalli narsimhulu: రాజ్యసభకు పంపుతానని చంద్రబాబు మాట ఇచ్చి పంపలేదు!: మోత్కుపల్లి

  • నాకు ముందు, వెనుక ఎవరూ లేరు
  • క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబుకు అండగా నిలిచా
  • వాడుకుని వదిలేసే ఏకైక నాయకుడు చంద్రబాబు

తాను ఒక దళితుడినని... తనకు వెనుక, ముందు ఎవరూ లేరని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి వ్యాపారాలు, పైరవీలు చేయలేదని, ఏ ఒక్కరి వద్ద యాచించింది లేదని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాలతో ప్రజలకు సేవ చేశానని తెలిపారు. ఎన్టీఆర్ మనుషులందరినీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు నెట్టేశారని చెప్పారు. భువనగిరిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

2009 నుంచి 2014 వరకు చంద్రబాబు క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నారని... ఆయనను తెలంగాణ నుంచి తరిమేసే ప్రయత్నాలు జరిగాయని... అలాంటి పరిస్థితుల్లో తాను ఆయనకు అండగా నిలబడ్డానని... అయినా తన త్యాగాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజ్యసభకు పంపుతానని మాట ఇచ్చి పంపలేదని... ఆ పనిని ఆయన చేసుంటే ఏపీ, టీఎస్ ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టేవారని తెలిపారు. రాజకీయాల్లో వాడుకుని వదిలేసే ఏకైక వ్యక్తి చంద్రబాబేనని చెప్పారు. ఆలేరు నుంచి ఒంటరిగానే పోటీ చేస్తానని... విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత తనదని చెప్పారు.

More Telugu News