తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ.. టీడీపీ శ్రేణుల్లో జోష్!
- అక్టోబర్ 1న ఖమ్మం రానున్న బాలయ్య
- తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య తరఫున ప్రచారం
- బహిరంగ సభలో పాల్గొననున్న హీరో
అక్టోబర్ 1న కృష్ణాజిల్లా నందిగామ నుంచి ఖమ్మంలోని మధిరకు బాలకృష్ణ చేరుకుంటారు. అనంతరం రాయపట్నంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అలాగే మధిర అంబేద్కర్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి, దెందుకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బోనకల్ మండలం ఆళ్లపాడు, నారాయణపురంలో సైతం ఎన్టీ రామారావు విగ్రహాలను బాలకృష్ణ ఆవిష్కరిస్తారు. అనంతరం బాలయ్య తల్లాడలో మధ్యాహ్న భోజనం చేస్తారు.
భోజనం తర్వాత సత్తుపల్లి నియోజకవర్గానికి చేరుకుని టీడీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తరఫున ప్రచారం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, బాలయ్య ఈ సభకు వస్తున్న నేపథ్యంలో టీటీడీపీ శ్రేణులు భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నాయి.