sabita: ప్రియుడి బ్లాక్ మెయిల్ భరించలేక ఒంటికి నిప్పంటించుకున్న మహిళ!

  • మనస్పర్థలతో భర్తకు దూరంగా ఉన్న సబిత
  • వెంకటేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం
  • మళ్లీ భర్తకు చేరువైన సబిత
  • పట్టించుకోని పోలీసులు 

హైదరాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మెయిన్ గేటు ముందు సబిత (34) అనే మహిళ నిన్న ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె శరీరం 70 శాతానికి పైగా కాలిపోయింది. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు కారణం అక్రమ సంబంధమే అనే విషయం వెలుగు చూసింది.

సికింద్రాబాద్ అన్నానగర్ కు చెందిన సబితకు అదే ప్రాంతానికి చెందిన దినేష్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకటేష్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. అయితే, ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని దృశ్యాలను వెంకటేష్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఇటీవల వెంకటేష్ తో కూడా ఆమెకు మనస్పర్థలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో, మళ్లీ భర్తకు చేరువయ్యేందుకు సబిత యత్నించింది. దీన్ని గమనించిన వెంకటేష్... తనతోనే ఉండాలని, పిలిచినప్పుడల్లా రావాలని హెచ్చరించాడు. రాకపోతే ఫోన్ లో ఉన్న ఫొటోలు, వీడియోలను దినేష్ కు చూపిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. బ్లాక్ మెయిల్ చేసి ఆమెను మళ్లీ లొంగదీసుకున్నాడు. ఈ విషయం కాస్తా భర్త దినేష్ కు తెలిసింది. దీంతో, భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ భర్త వినలేదు.

ఇదే సమయంలో మరోవైపు వెంకటేష్ వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బేగంపేట పోలీసులకు వెంకటేష్ పై ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో... ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి పీఎస్ మెయిన్ గేటు ముందు... ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రస్తుతం చావుబతుకుల్లో ఉంది. అక్రమ సంబంధాలు పచ్చటి సంసారాన్ని, జీవితాలను ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి సబిత ఉదంతం మరో ఉదాహరణ.

More Telugu News