varavara rao: మోదీ హత్యకు వరవరరావు ఫండింగ్ చేస్తున్నారనే ఆరోపణలు దారుణం.. ఇది కేంద్ర ప్రభుత్వ కుట్ర!: సంధ్య

  • మోదీ హత్యకు వరవరరావు కుట్ర పన్నారనడం దారుణం
  • వైట్ కాలర్ మేధావులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది
  • కేంద్రానికి వ్యతిరేకంగా గొంతుక వినిపించకుండా కుట్ర జరుగుతోంది

  అనునిత్యం మన ముందు కనపడే విరసం నేత వరవరరావు ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనడం దారుణమని మహిళా నేత సంధ్య మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్ర అని అన్నారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరుగుతోందనే వార్తలను గతంలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజాసంఘాలన్నీ ఖండించాయని గుర్తు చేశారు. మోదీ హత్యకు కావాల్సిన ఫండింగ్ ను వరవరరావు చేస్తున్నారనే ఆరోపణలు చాలా దారుణమని అన్నారు.

వరవరరావును అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో, ప్రజాసంఘాల నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాలకు మౌత్ పీస్ గా ఉన్న వరవరరావుపై జరుగుతున్న దాడిని తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. వైట్ కాలర్ మేధావులను అణగదొక్కే ప్రయత్నం ప్రస్తుతం మన దేశంలో జరుగుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క గొంతుక కూడా వినిపించకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బషీర్ బాగ్ విద్యుత్ పోరాటం కాల్పుల్లో మరణించిన అమరవీరులకు నివాళి అర్పించేందుకు తాము వెళ్లామని, ఉదయం నుంచి తాము టీవీలో వార్తలు కూడా చూడలేదని, వరవరరావు ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టు తమకు మధ్యలో సమాచారం అందిందని తెలిపారు. వెంటనే తాము ఇక్కడకు వచ్చామని చెప్పారు. 

More Telugu News