AB Vajpayee: ‘భారత్ వెలిగిపోతుంది’ వికటిస్తుందని వాజ్‌పేయి ముందే చెప్పారు: అటల్ సన్నిహితుడు శివ్‌కుమార్

  • ఎన్నికల్లో ఓడిపోబోతున్నట్టు వాజ్‌పేయికి ముందే తెలుసు
  • ముందస్తుకు వెళ్లడం ఆయనకు ససేమిరా ఇష్టం లేదు
  • మోదీ ప్రభుత్వం ఆయన మార్గాన్ని అనుసరిస్తుందని కోరుకుంటున్నా

‘భారత్ వెలిగిపోతోంది’ అనే నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వాజ్‌పేయికి ఇష్టం ఉండేది కాదని 50 ఏళ్లపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడుగా, సహచరుడిగా ఉన్న శివ్‌కుమార్ పరీక్ తెలిపారు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అటల్‌కు ఇష్టం లేదని, అయినా మొండి పట్టుదలతో ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుందని ఆయన గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ముందస్తుకు వెళ్లడం ఓ కారణమైతే, ‘భారత్ వెలిగిపోతోంది’ అనేది రెండో కారణమని వాజ్‌పేయి చెప్పినట్టు పరీక్ పేర్కొన్నారు. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం  అర్ధరాత్రి ఇంటికి వచ్చిన వాజ్‌పేయి ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నట్టు తనతో చెప్పారని పరీక్ గుర్తు చేసుకున్నారు.

వాజ్‌పేయి వ్యాఖ్యలను తాను ఖండించానని, దీనికి ఆయన తీవ్రంగానే స్పందించారని పరీక్ పేర్కొన్నారు. ‘‘ఏ లోకంలో ఉన్నావు నువ్వు.. నేను ఇప్పుడే ప్రచారం చేసి వస్తున్నా’’ అని తనతో చెప్పినట్టు తెలిపారు. అప్పట్లో పార్టీకి, ప్రధానికి మధ్య ఉన్న సమన్వయం ఇప్పుడు లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అటల్ జీ మార్గాన్ని అనుసరిస్తుందని భావిస్తున్నానని పరీక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మార్గంలో పయనించడం అంటే ఆయనలా జీవించడమని, ప్రధానిగా  ఆయన పనిచేసినట్టు చేయడమని పరీక్ పేర్కొన్నారు.

More Telugu News