wife: మిస్డ్ కాల్ తో మిసెస్ ను చేసుకున్నాడు.. ఆ తర్వాత వదిలేశాడు!

  • శ్రీకాకుళం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రకాశం జిల్లా వాసి
  • రెండు నెలల తర్వాత గర్భవతిని పుట్టింట్లో వదిలేసిన వైనం
  • చావైనా, బతుకైనా భర్తతోనే అంటున్న బాధితురాలు

నమ్మి మోసపోయిన మరో దీనురాలి గాథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలతి అనే యువతికి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డితో ఓ మిస్ట్ కాల్ ద్వారా హైదరాబాదులో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టేసుకుని తిరిగారు. ఆ తర్వాత మాలతి కుటుంబసభ్యులను ఒప్పించి, మహేశ్వర్ రెడ్డి ఆమెను వివాహం చేసుకున్నాడు. హైదరాబాదులోనే ఉద్యోగం చేసుకుంటూ... ఉప్పల్ లోని గణేష్ నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. రెండు నెలల తర్వాత భార్యను శ్రీకాకుళం తీసుకెళ్లి, పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. అప్పటికే ఆమె గర్భవతి అయింది.

ఆ తర్వాత ఆమెతో మాట్లాడటం కూడా మానేశాడు. భార్య ఫోన్ చేస్తే కట్ చేసేవాడు. దీంతో, బంధువులకు తన ముఖం చూపించలేక, ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. చేసేది ఏమీ లేక... చివరకు ఆమె నేరుగా ఓబులాపురానికి వెళ్లింది. తన భార్య వచ్చిందన్న విషయం తెలుసుకున్న మహేశ్వర్ రెడ్డి ఇంటికి తాళం వేసి, తన తల్లిదండ్రులతో పాటు ఎటో వెళ్లి పోయాడు. దీంతో, ఆమె ఆ ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది.

తన భర్తను తాను ఎంతో నమ్మానని, అతను ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేక పోయానని మాలతి వాపోయింది. చావైనా, బతుకైనా తన భర్తతోనే అని ఆమె తెలిపింది. తన భర్త ఆచూకీ తెలిపి, తనకు న్యాయం చేయాలని వేడుకుంది. మరోవైపు, మహేశ్వర్ రెడ్డి గత చరిత్ర వెలుగులోకి వచ్చింది. గతంలో గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంటి నుంచి తీసుకెళ్తుండగా గమనించిన ఆమె కుటుంబసభ్యులు ఆయనను చితకబాదారట. 

More Telugu News