Nizamabad District: డీఎస్ కుమారుడు సంజయ్ ని విచారిస్తున్న పోలీసులు... నేడు అరెస్ట్!

  • ఈ ఉదయం పోలీసులకు సరెండర్ అయిన సంజయ్
  • విచారిస్తున్న నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలోని బృందం
  • విచారణ పూర్తి కాగానే అరెస్ట్ చేసే అవకాశం

టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం నుంచి ఆయన్ను విచారిస్తున్న పోలీసులు, సాయంత్రంలోగా అరెస్ట్ చేసినట్టు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆయన నడుపుతున్న శాంకరి నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధించారని గత నెలాఖరులో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న సంజయ్ కి ముందస్తు బెయిల్ ను ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఆపై ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద ఈ నెల 12 లోపు విచారణకు రావాలని నోటీసులను అందించామని అధికారులు గత వారం వెల్లడించిన సంగతి విదితమే. దీంతో ఆయన ఈ ఉదయం పోలీసులకు సరెండర్ అయ్యారు.

ప్రస్తుతం ఆయన్ను నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం విచారిస్తోంది. సంజయ్ తో పాటు కృపాకర్ రెడ్డి అనే న్యాయవాది సైతం పోలీసు స్టేషన్ కు వెళ్లగా, విచారణ జరుగుతున్న గదిలోకి వచ్చేందుకు పోలీసులు అంగీకరించలేదని సమాచారం. సంజయ్ పై నిర్భయ చట్టంతో పాటు, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు ఈనెల 3వ తేదీన రిజిస్టర్ అయ్యాయి. 

More Telugu News