Jammu And Kashmir: బీజేపీతో చేతులు కలపడమంటే ఓ కప్పు విషం తీసుకోవడమే!: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ

షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్ లో ఇటీవల పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీపై మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, బీజేపీతో చేతులు కలపడమంటే ఓ కప్పు విషం తీసుకోవడమేనని విమర్శించారు.

ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగా రెండు సంవత్సరాల రెండు నెలలు ఆ బాధను తాను భరించానని అన్నారు. వాజ్ పేయీ హయాంలో బీజేపీతో తమకు మంచి సంబంధాలు ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కాగా, పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటి నుంచి ఆ పార్టీపై ఆమె నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. మూడు రోజుల క్రితం పీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలోనూ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీడీపీని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలను ఆమె హెచ్చరించారు.
Go Back to Shorts
Jammu And Kashmir
mehbuba mufti

More Telugu News