Reshma Rathod: బీజేపీలో చేరనున్న 'ఈ రోజుల్లో' హీరోయిన్ రేష్మ... మహబూబాబాద్ స్థానం నుంచి పోటీ!

  • రేష్మను దింపితే ఎస్టీల ఓట్లు వస్తాయన్న ఆలోచన
  • సమీప బంధువులు ఉండటం, స్వస్థలం కావడం ప్లస్ పాయింట్
  • ఇప్పటికే పర్యటనలు ప్రారంభించిన రేష్మ రాథోడ్

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాధాబాయి రాథోడ్ కుమార్తె, 'ఈ రోజుల్లో' చిత్రంలో ఓ హీరోయిన్ గా నటించి మెప్పించిన రేష్మ రాథోడ్ బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలి చిత్రం తరువాత రెండు మూడు తెలుగు చిత్రాల్లో నటించి, ఆపై పలు తమిళ చిత్రాలు చేసి, రాజకీయ రంగప్రవేశం చేసిన రేష్మను వైరా అసెంబ్లీ లేదా మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్టు సమచారం.

రేష్మను రంగంలోకి దింపితే ఎస్టీల ఓట్లను పొందవచ్చన్న ఆలోచనలో ఉన్న బీజేపీ, ఈ విషయంలో ఆమెను సంప్రదించినట్టు తెలిసింది. గిరిజన యువతి కావడం, ఈ ప్రాంతంలో సమీప బంధువులు ఉండటం, స్వస్థలం కావడం, సినిమా హీరోయిన్ గా ఉన్న గుర్తింపు ఆమెకు ప్లస్ పాయింట్స్ అవుతాయన్నది బీజేపీ ఆలోచనగా ఉంది.

కాగా, ఇటీవల కారేపల్లి మండలానికి వచ్చి పలు ప్రాంతాల్లో పర్యటించిన రేష్మ, తన సమీప బంధువులను తరచూ కలుస్తున్నారు కూడా. కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి ఆమె చెబుతుంటే, యువతలో మంచి స్పందన వస్తోందని బీజేపీ అగ్ర నేతలకు సమాచారం అందడంతో ఆమె పోటీ ఖాయంగానే కనిపిస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అటు తన మనసులోని మాటనూ రేష్మ వెల్లడించలేదు.

More Telugu News