'ప్రతిరోజూ 350 కిలోమీటర్ల ప్రయాణం'పై కర్ణాటక మంత్రి స్పందన!

  • రోజూ రాత్రి సొంత నియోజకవర్గంలో నిద్రిస్తున్నారంటూ వార్తలు  
  • ఇందులో వాస్తవం లేదని చెప్పిన మంత్రి
  • అధికారిక నివాసం లేకపోవడమే కారణమన్న రేవణ్ణ
బెంగళూరులో సొంత ఇంట్లో వుంటే కీడు జరుగుతుందంటూ ఓ జ్యోతిష్కుడు ఇచ్చిన సూచన మేరకు ప్రతి రోజు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారంటూ వచ్చిన వార్తలను కర్ణాటక మంత్రి, సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ కొట్టిపడేశారు. తనకు అధికారిక నివాసాన్ని ఇంకా కేటాయించకపోవడం వల్లే... తాను ప్రతిరోజు ప్రయాణం చేయాల్సి వస్తోందని చెప్పారు. తనకు ఏ జ్యోతిష్యుడు ఇలాంటి సలహా ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనకు అధికారిక నివాసం కేటాయించేంత వరకు ఈ ప్రయాణం తప్పదని చెప్పారు.

రేవణ్ణ ఎంపిక చేసుకున్న బంగళాలో మాజీ మంత్రి మహదేవప్ప ఉన్నారు. మరో మూడు నెలల పాటు ఆయన అందులోనే ఉండబోతున్నారు. దీనికి సంబంధించి రేవణ్ణ మాట్లాడుతూ, ఆ బంగళాను మహదేవప్ప ఖాళీ చేసేంత వరకు తాను వేచి ఉంటానని చెప్పారు.

హాసన్ జిల్లాలోని హొళెనరసిపుర నియోజకవర్గానికి రేవణ్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నారు. ప్రతి ఉదయం 5 గంటలకు నిద్ర లేచి, 175 కిలో మీటర్లు ప్రయాణించి బెంగళూరుకు చేరుకుంటారు. పనులన్నీ పూర్తయిన తర్వాత, తిరిగి అర్ధరాత్రికి హొళెనరసిపురకు చేరుకుంటారు. మరోవైపు, జ్యోతిష్కులపై రేవణ్ణకు నమ్మకం ఎక్కువని అందరూ చెప్పుకుంటుంటారు.
Go Back to Shorts
revanna
travel
karnataka
minister

More Telugu News