ముందస్తు ఎన్నికలు తప్పేలా లేవు: దేవెగౌడ

  • ‘ముందస్తు’కు బీజేపీ సన్నాహాలు
  • కాంగ్రెస్ తో దేశమంతా పొత్తు వర్తిస్తుందని చెప్పలేం 
  • కర్ణాటక ప్రభుత్వం మరీ అంత బలహీనంగా లేదు
దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అభిప్రాయపడ్డారు. గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. బీజేపీ సన్నాహాలు చూస్తుంటే ఎన్నికలు ముందుగా రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీకి డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయని, వీటితోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

ముందస్తు ఎన్నికలను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా సమర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా దేవెగౌడ గుర్తు చేశారు. కర్ణాటకలో తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన దేశమంతా అది వర్తిస్తుందని భావించవద్దన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మాత్రం పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య విభేదాలు లేవని కొట్టిపడేశారు. తమది ఒకటి రెండు రోజుల్లో కూలిపోయేంత బలహీన ప్రభుత్వం కాదని దేవెగౌడ స్పష్టం చేశారు.
Go Back to Shorts
HD Devegowda
Karnataka
BJP
Elections

More Telugu News