Jagan: జగన్ కు దమ్ముంటే.. ప్రధానిని ఒప్పించి ఉపఎన్నికలు వచ్చేలా చేయాలి: మంత్రి అయ్యన్నపాత్రుడు

  • వైసీపీ ఎంపీలవి రాజీనామా డ్రామాలు
  • నలభై ఐదు రోజుల్లో ఉపఎన్నికలు వచ్చేలా జగన్ చేయాలి
  • ఉపఎన్నికలు వస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది

వైసీపీ ఎంపీలవి రాజీనామా డ్రామాలని, జగన్ కు దమ్మూధైర్యం ఉంటే ప్రధాని మోదీని ఒప్పించి ఉపఎన్నికలు వచ్చేలా చేయాలని మంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నలభై ఐదు రోజుల్లో ఉపఎన్నికలు వచ్చేలా జగన్ చేయాలని, ఉపఎన్నికలు వస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. ల్యాండ్ స్కామ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారని, తానెప్పుడో ఈ విషయం గురించి ప్రస్తావించానని  చెప్పుకొచ్చారు.

కాగా, ఏపీకి  చెందిన మరో మంత్రి సోమిరెడ్డి కూడా జగన్ పై విమర్శలు చేశారు. ఉపఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని అన్నారు. వైసీపీ ఎంపీలకు రాజీనామాలు చేయడం ఇష్టం లేకపోయినా జగన్ పోరు పడలేక ఆ పని చేసినట్టున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులను ఎంపీలు త్యాగం చేశారని వైసీపీ చెబుతుండటంపై విమర్శలు చేశారు. వైసీపీ ఎంపీలు కేవలం తమ ఏడాది జీతాలను మాత్రమే త్యాగం చేశారని ఎద్దేవా చేశారు.

More Telugu News