Telangana: కోటి రూపాయలిస్తా.. కేసీఆర్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పించండి: మంద కృష్ణ మాదిగ

  • సీఎంను కలవడం గగనంగా మారింది
  • పదిసార్లు లేఖ రాసినా స్పందన లేదు
  • సమీక్ష లేక దళితులకు అన్యాయం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో తనకు రెండు రోజుల్లో అపాయింట్‌మెంట్ ఇప్పించిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు శివారులోని కిష్టారావుపల్లిలో హత్యకు గురైన తండ్రీ కొడుకులు సావనపెల్లి ఎల్లయ్య, శేఖర్‌ కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు.  

ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేసింది తానేనని గుర్తు చేశారు. అటువంటిది ఇప్పుడు ఆయనను కలవడమే కష్టంగా మారిందన్నారు. అపాయింట్‌మెంట్ కోసం ఇప్పటి వరకు పది లేఖలు రాశానని, వందలసార్లు కోరినట్టు తెలిపారు. నాలుగేళ్లుగా సమీక్షలు లేక దళితులు అన్యాయమైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎవరైనా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇప్పించాలని మంద కృష్ణ మరోమారు వేడుకున్నారు.

More Telugu News