Lalu prasad Yadav: లాలు కుమారుల మధ్య విభేదాలు.. రచ్చకెక్కిన తేజ్ ప్రతాప్!

  • తేజ్ ప్రతాప్, తేజస్వీ యాదవ్ మధ్య విభేదాలు
  • పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపణ
  • కావాలనే కొందరు దూరం పెంచుతున్నారన్న తేజ్ ప్రతాప్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయులు రచ్చకెక్కారు. నిన్నమొన్నటి వరకు రామలక్ష్మణుల్లా కలిసి మెలసి ఉన్న వీరి మధ్య విభేదాలు పొడసూపాయి. తనను కరివేపాకులా తీసి పడేస్తున్నారని లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ్ముడికి ఇస్తున్న ప్రాధాన్యం తనకు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా మీడియా ఎదుటే సోదరుడిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

తేజ్ ప్రతాప్‌తో పోలిస్తే తేజస్వీ యాదవ్ రాజకీయాల్లో చాలా చురుకు. గతంలో నితీశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరోవైపు మీడియాలోనూ సోదరుడి హవానే నడుస్తుండడం తేజ్ ప్రతాప్‌కు మింగుడుపడడం లేదు. దీంతో తనను తొక్కి పడేస్తున్నారని, రాజకీయాల్లో ఎదగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీలోని కొందరు నేతలు కావాలనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే, పార్టీకి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోబోనని తేజ్ ప్రతాప్ స్పష్టం చేశారు.

More Telugu News