Pawan Kalyan: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..పవన్ కల్యాణ్కి శ్రీకాకుళం ప్రజలు బ్రహ్మరథం పట్టారు!: జనసేన
ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఇది కనిపిస్తుందని, తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కి శ్రీకాకుళం ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆ మార్పునకు శ్రీకారం చుట్టారని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ సత్తా తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో టీడీపీ ఆయన మద్దతు తీసుకుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటడం ఖాయమని, ప్రజలు పవన్పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీకాకుళంలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యల మూలాలు, పాలకుల నిర్లక్ష్య ధోరణిని గ్రహించారని అన్నారు.