PRP: తోట చంద్రశేఖర్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన పవన్ కల్యాణ్!

  • అప్పట్లో ప్రజారాజ్యంలో చేరిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్
  • గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేత
  • ఇప్పుడు జనసేనలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు

గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరిన మహారాష్ట్ర మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు ఇప్పుడు జనసేనలో ప్రముఖ స్థానం లభించింది. గుంటూరు ప్రాంతానికి చెందిన తోట చంద్రశేఖర్ ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన చంద్రశేఖర్, 2008 వరకూ పలు కీలక బాధ్యతలు నిర్వహించి, ఆపై ప్రజారాజ్యంలో చేరారు. గుంటూరు నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఈయన, అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా నిలిచారు.

ఇటీవల జనసేనలో చేరిన చంద్రశేఖర్, అప్పటి నుంచి పవన్ కు సన్నిహితుడిగా మారి, సలహాలు, సూచనలు ఇస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రశేఖర్ ను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోనూ నియమించిన పవన్, ఏపీకి వచ్చిన నిధుల లెక్కలు బయటకు తీయడంలో ఆయన పడిన శ్రమను గుర్తించారు. ఇప్పుడాయనకు ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు లేదా గుంటూరు లోక్ సభ స్థానానికి ఆయన పోటీ పడవచ్చని తెలుస్తోంది.

More Telugu News