pawan kalyan: ప్రజలు అవకాశమిస్తే... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా: పవన్ కల్యాణ్
ప్రజలు అవకాశమిస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని అందిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మీరు 'సీఎం' అంటూ నినాదాలు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రిని కాలేనని... ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న తర్వాతే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. నేతల స్వార్థం కోసం, వారి కుటుంబాల కోసం ప్రభుత్వాలు పని చేయరాదని... ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోరాదని సూచించారు. టీడీపీ, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయని... అందుకే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. బాధ్యతల నుంచి పారిపోయే వ్యక్తిని తాను కాదని అన్నారు. ఈరోజు ఆయన గంగవరం వెళ్లి పోర్టు నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.