inter: తెలంగాణలో 47 ఇంటర్‌ కాలేజీల్లో ఆకస్మిక దాడులు!

  • వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తోన్న కళాశాలలు
  • ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల చర్యలు
  • కాలేజీల యాజమాన్యాలకి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తోన్న కళాశాలలపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు, ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా, వేసవి సెలవుల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులను నిర్వహిస్తోన్న కార్పొరేట్ కళాశాలలపై ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీలు నిర్వహించి, విద్యార్థులను బయటకు పంపి, కాలేజీల యాజమాన్యాలకి నోటీసులు ఇచ్చి, ఆయా కళాశాలలకు తాళాలు వేశారు.

బోర్డు నుండి ప్రథమ సంవత్సర ప్రవేశాల ప్రకటన వెలువడక ముందే విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెట్టి కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఇలా తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఏ. అశోక్‌ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా ఇంటర్ విద్య అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో 15 కళాశాలలపై దాడులు జరపగా హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ విద్యాధికారి జయప్రద ఆధ్వర్యంలో 18 కళాశాలలపై దాడులు జరిగాయి.

రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంకయ్య నాయక్ ఆధ్వర్యంలో 14 కళాశాలలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇంటర్ బోర్డు నియమించిన 27 బృందాలు పాల్గొన్నాయి. మొత్తంగా పై మూడు జిల్లాలలో 47 కళాశాలలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.
inter
Hyderabad
colleges

More Telugu News