mahatma Gandhi: జీసస్ గురించి ప్రస్తావించిన గాంధీ లేఖ వేలానికి!

  • జీసస్ గొప్ప బోధకుడన్న గాంధీ
  • ప్రపంచంలోని మతాలన్నీ శాంతిని బోధిస్తాయని నమ్మిన మహాత్ముడు
  • అందరిలోనూ సమానత్వాన్ని చూసిన గాంధీ

క్రీస్తు గురించి ప్రస్తావిస్తూ మహాత్మాగాంధీ రాసిన లేఖ వేలానికి వచ్చింది. పెన్సిల్వేనియాకు చెందిన రాబ్ కలెక్షన్ సేకరించిన ఈ లేఖను వేలం వేయనున్నారు. అమెరికాలోని క్రైస్తవ మత బోధకుల్లో ఒకరైన మిల్టన్ న్యూ బెర్రీ ఫ్రాంట్జ్‌కు ఏప్రిల్ 6, 1926న గాంధీ లేఖ రాశారు. ఇప్పుడీ లేఖకు వేలంలో 50 వేల డాలర్లు పలికే అవకాశం ఉందని చెబుతున్నారు.

గాంధీ రాసిన లేఖలో జీసస్‌ను ప్రస్తావిస్తూ.. మానవజాతి గొప్ప బోధకుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు. గాంధీ లేఖ గురించి రాబ్ కలెక్షన్స్ అధినేత నాథన్ రాబ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని మతాలన్నీ శాంతిని బోధిస్తాయన్న విషయాన్ని గాంధీ బాగా జీర్ణించుకున్నారని, ఆ విషయం ఈ లేఖలో ప్రస్ఫుటమవుతోందన్నారు. జీసస్ గొప్ప బోధకుడని నమ్మిన గాంధీ, తోటి వారిలో కూడా సమానత్వాన్ని చూశారని కొనియాడారు. జీసస్ గురించి గాంధీ మరే లేఖలోనూ ప్రస్తావించినట్టు తమ పరిశోధనలో వెల్లడి కాలేదని రాబ్ పేర్కొన్నారు. 

More Telugu News