నేనేమైనా దేశ రహస్యాలను ఇండియాకు అమ్మానా?: నవాజ్ షరీఫ్ పై నిప్పులు చెరిగిన ఇమ్రాన్ ఖాన్
- మూడో పెళ్లికి సిద్ధమైన ఇమ్రాన్
- విమర్శనాత్మక కథనాలు రాస్తున్న షరీఫ్ మీడియా
- షరీఫ్ పై మండిపడ్డ ఇమ్రాన్
తనకు తన పిల్లలు, బుస్రా బేగమ్ కు చెందిన కుటుంబం చాలా ముఖ్యమని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. నవాజ్ షరీఫ్, మీర్ షకీల్ ఉర్ రహ్మాన్ లకు చెందిన మీడియా రాసే పిచ్చి కూతలను తాను పట్టించుకోనని ఆయన చెప్పారు. జియో టెలివిజన్ నెట్ వర్క్ రహ్మాన్ కు చెందినది. నవాజ్, రహ్మాన్ ల మీడియా తప్పుడు వార్తలతో తాను మరింత బలపడ్డానని, వారిపై పోరాటానికి మరింత బలవంతంగా తయారయ్యానని ఇమ్రాన్ అన్నారు. గత 40 ఏళ్లుగా నవాజ్ షరీఫ్ తనకు తెలుసని... ఆయన అనైతిక జీవితం ఏమిటో తనకు బాగా తెలుసని చెప్పారు. అయితే ఆ వివరాలను వెల్లడించి, తన స్థాయిని తగ్గించుకోలేనని తెలిపారు.
తాను ఏ బ్యాంకును దోచుకోలేదని, దేశ సంపదను కొల్లగొట్టలేదని, ఇండియాకు రహస్యాలను వెల్లడించలేదని... అయినా కూడా తాను ఏదో పెద్ద నేరం చేసినట్టుగా చూపెడుతున్నారని ఇమ్రాన్ మండిపడ్డారు. కేవలం పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. పనామా పేపర్లలో ఆరోపణలు ఎదుర్కున్న నవాజ్ కుటుంబసభ్యులు... అవినీతి కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇదే కారణంగా షరీఫ్ ప్రధాని పదవిని కూడా కోల్పోయారు.