సందడిగా కృష్ణపట్నం పోర్టు.. జాతీయ సెయిలింగ్ పోటీలు ప్రారంభం!
- మూడు రోజులపాటు జరగనున్న జాతీయ స్థాయి పోటీలు
- 27 నుంచి ఇక్కడే అంతర్జాతీయ పోటీలు
- దేశవ్యాప్తంగా 300, ఆసియా దేశాల నుంచి 400 సెయిలర్ల రాక
- త్వరలోనే పోర్టులో సెయిలింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్న సీఈవో అనిల్ ఎండ్లూరి
ఈ సందర్భంగా పోర్టు సీఈవో అనిల్ ఎండ్లూరి మాట్లాడుతూ.. ఈనెల 25 వరకు జాతీయ స్థాయి పోటీలు, 27 నుంచి 31వ తేదీ వరకు అంతర్జాతీయ పోటీలు ఇక్కడ జరగనున్నట్టు తెలిపారు. జాతీయ పోటీలకు దేశవ్యాప్తంగా 25 క్లబ్ల నుంచి 300 మందికిపైగా సెయిలర్లు పాల్గొంటుండగా, అంతర్జాతీయ పోటీలకు ఆసియా దేశాల నుంచి 400 మంది సెయిలర్లు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. ఆప్టిమిస్టిక్, లేజర్ 4.7, లేజర్, రేడియల్, విండ్సర్ఫ్ క్లాస్ విభాగాల్లో పోటీలు జరగనున్నట్టు అనిల్ తెలిపారు. త్వరలోనే కృష్ణపట్నంలో సెయిలింగ్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలుష్య రహిత ఓడరేవులో ఇటువంటి కార్యక్రమాలు జరగడం ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతాయని కోస్ట్గార్డ్ కమాండెంట్ అమిత్ ఉనియల్ అన్నారు. కాగా, తొలిరోజు ప్రాక్టీస్ సెషన్స్లో సెయిలర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు.
