MS Dhoni: ధోనీ గురించి కాదు.. ముందోసారి వెనక్కి తిరిగి చూసుకోండి.. మాజీలకు రవిశాస్త్రి ఘాటు రిప్లై!

  • మహీకి అండగా భారత కోచ్
  • విమర్శించే ముందు తమ కెరీర్‌ను చూసుకోవాలని హితవు
  • మైదానంలో ధోనీకి మించిన ఆటగాడు లేడని కితాబు

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి జట్టు కోచ్ రవిశాస్త్రి అండగా నిలిచాడు. ఘాటు స్పందనతో విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. టీ20కి ధోనీ ఆటతీరు సరిపోదని, ఈ ఫార్మాట్ నుంచి ధోనీ తప్పుకుని యువకులకు చోటిస్తే మంచిదని వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ వంటివారు సూచించారు.

ఆ వ్యాఖ్యలు క్రికెట్ ఇండియాలో పెను దుమారమే లేపాయి. కెప్టెన్ కోహ్లీ, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సహా పలువురు ధోనీకి మద్దతు పలికారు. ధోనీని విమర్శించిన వారిపై దుమ్మెత్తిపోశారు. తాజాగా ధోనీకి రవిశాస్త్రి అండగా నిలిచాడు. దేశానికి రెండు ప్రపంచకప్‌లు సాధించి పెట్టిన ధోనీని విమర్శించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి తమ కెరీర్‌ను చూసుకోవాలని చురకలంటించాడు. జట్టుకు ధోనీ చేసిన సేవలు అమూల్యమైనవని, దిగ్గజ ఆటగాడికి జట్టు అండగా నిలవాల్సిన సమయం ఇదని పేర్కొన్నాడు.

మైదానంలో ధోనీ కంటే మెరుగైన ఆటగాడు కనిపించడని, బ్యాట్‌మన్‌గా, కీపర్‌గా అతడి ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. కాగా, రేపటి నుంచి శ్రీలంకతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. రవిశాస్త్రి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో తొలి టెస్ట్ సిరీస్ ఇదే.

More Telugu News