lakshmi parvathi: ఒకడేమో ప్లాట్ ఫామ్ వెధవ, మరొకడేమో అప్పుల్లో ఉన్నాడు.. సినిమా తీసే దమ్ము, ధైర్యం వీరికి లేవు!: లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు

  • సినిమా తీసే దమ్ము, ధైర్యం వీరికి లేవు 
  • వీరి వెనకున్న శక్తిని బయటకు లాగుతా
  • చట్టపరంగా ఎదుర్కొంటా

'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను తెరకెక్కిస్తున్న కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు. ఒక మహిళకు పెళ్లైన తర్వాత ఆమెపై కన్న తండ్రికి కూడా అధికారం ఉండదని... అలాంటిది తన జీవితం గురించి సినిమా తీయడానికి వీళ్లంతా ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై తాను ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు.

తనకు సంబంధం లేని వ్యక్తులు తన పర్మిషన్ లేకుండానే, తనపై సినిమా తీస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. 25 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి పేరును తన పక్కన చేర్చడం చట్ట విరుద్ధమని ఆమె అన్నారు. మొదటి నుంచి తనను అడుగడుగునా అడ్డుకుంటున్న వ్యక్తులు, ఎన్టీఆర్ తో తన వివాహాన్ని కూడా అడ్డుకోవాలని చూసిన వ్యక్తులకు తన మాటలు తగులుతాయని చెప్పారు. కేతిరెడ్డిలాంటి వారి వెనకున్న ఆ శక్తులు ఎవరో సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు.

అడ్డమైన ఒక వెధవ తన పక్కన మరెవరో పేరు పెట్టి... తన భర్త సమాధి వద్దకు రావడమేంటని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. కేతిరెడ్డి వెనక ఉన్న వ్యక్తులకు ధైర్యం ఉంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. తనకు ఎవరూ లేనప్పుడే వీరందరితో తాను ఒంటరిగా పోరాడానని... ఇప్పుడు తన వెనుక ప్రజలు ఉన్నారని చెప్పారు. సినిమాను తీస్తున్న వ్యక్తులకు అంత సీన్ లేదని... ఒకడేమో అప్పుల్లో ఉన్నాడని, మరొకడేమో ప్లాట్ ఫామ్ వెధవ అని... వీరికి సినిమా తీసేంత దమ్ము, ధైర్యం లేవని అన్నారు.

 వీరిని ముందు పెట్టి ఒక వ్యక్తి నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. ఆ వ్యక్తి ఎవరో బయటకు వచ్చే పరిస్థితిని తాను తీసుకురాబోతున్నానని, లీగల్ గా ముందుకెళతానని చెప్పారు. అమరావతిలో కూడా ఈ సినిమా పోస్టర్లు వేస్తారా? అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ ఫొటోలు పెట్టుకునే మీరు... ఎన్టీఆర్ భార్యకు అవమానం జరుగుతుంటే మౌనంగా ఎలా ఉంటారని ధ్వజమెత్తారు. తెలంగాణ డీజీపీకి తమ లాయర్ ఇప్పటికే లేఖ ఇచ్చారని... ఏపీ డీజీపీకి కూడా లేఖ ఇస్తానని చెప్పారు. 

More Telugu News