westren railway: 24 గంటల్లోనే రైల్వే యూటర్న్... బులెట్ రూట్లో లాభాలే లాభాలట!

  • నిన్న 40 శాతం ఆక్యుపెన్సీ లేదన్న వెస్ట్రన్ రైల్వే
  • నేడు 121 శాతం అధిక ఆక్యుపెన్సీ అంటూ మాట మార్పు
  • కమర్షియల్ మేనేజర్ ది ఓ మాట, పీఆర్వోది మరో మాట

లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో జపాన్ తో కలసి భారత్ తలపెట్టిన బులెట్ ట్రైన్ రూట్లో ...ముంబై-అహ్మధాబాద్ మధ్య 40 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయని నిన్న వెల్లడించిన వెస్ట్రన్ రైల్వేస్, 24 గంటల్లోనే మాట మార్చింది. సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గాలీ అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తూ, పశ్చిమ రైల్వేల కమర్షియల్ మేనేజర్ మంజిత్ సింగ్ వెల్లడించిన విషయాలకు పూర్తి విరుద్ధంగా నేడు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రవీందర్ బాకర్ ఓ ప్రకటన వెలువరించారు.

ఈ మార్గంలో గడచిన జూలై, సెప్టెంబర్ మధ్య రూ. 30 కోట్ల నష్టం వచ్చినట్టు మంజిత్ సింగ్ వెల్లడించగా, అందుకు విరుద్ధంగా ఈ రూట్ లాభాల్లో ఉందని రవీందర్ పేర్కొన్నారు. "ఈ రూట్ లో 9 డైరెక్ట్ రైళ్లు, మరో 25 దూరప్రాంత రైళ్లు తిరుగుతున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య రూ. 233 కోట్ల ఆదాయం వచ్చింది. స.హ. చట్టానికి ఇచ్చిన సమాధానంలో రెండు నగరాల మధ్యా ఉన్న దూరంలో మధ్యలో ఎక్కి మధ్యలో దిగేవారిని పరిగణనలోకి తీసుకోలేదు.

దూరప్రాంత రైళ్లలో ముంబై కన్నా ముందెక్కి, అహ్మదాబాద్ దాటి ప్రయాణిస్తున్న వారి వివరాలూ లేవు. అందువల్లే 40 శాతం ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఈ రూట్ లోని ఏ రైల్లోనూ సీట్లు ఖాళీ ఉండవు,. 9 రైళ్లలో మూడు నెలల కాలంలో 8.03 లక్షల బెర్తులుండగా 8.30 లక్షల మంది రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఈ నగరాలపై నుంచి వెళ్లే మిగతా 25 రైళ్లలో 10,70,710 బెర్తులుండగా, 12,30,585 రిజర్వేషన్లు జరిగాయి. ఇది 121 శాతం ఆక్యుపెన్సీ" అని ఆయన అన్నారు.

More Telugu News