Butta Renuka: అనుకున్నదే అయింది!.. వైసీపీకి బుట్టా రేణుక గుడ్ బై.. రేపే టీడీపీ తీర్థం?

  • టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం
  • ఎంపీ సీటుపై జగన్ స్పష్టత ఇవ్వకపోవడమే కారణం
  • లోక్ సభ సీటుపై హామీ ఇచ్చిన టీడీపీ 

కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీ తీర్థం పుచ్చుకునే సమయం వచ్చేసింది. రేపే (మంగళవారం) ఆమె టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆమెతోపాటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు ఇటీవల హల్‌చల్ చేశాయి. అయితే రేణుక స్వయంగా ఖండించారు. మరోవైపు పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించారు.

ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ సీటుపై రేణుక స్పష్టత కోరినట్టు సమాచారం. స్పందించిన జగన్ ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీనికి నిరాకరించిన రేణుక తాను లోక్‌సభకే పోటీ చేస్తానని జగన్‌కు తేల్చి చెప్పారు. ఈ విషయంలో అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.

అదే సమయంలో కర్నూలు ఎంపీ సీటును రేణుకకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలో ఒకదానిని ఓసీలకు, రెండో దానిని బీసీలకు టీడీపీ ఇస్తూ వస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా అవలంబించారు. ఎంపీ సీటును బీటీ నాయుడికి ఇచ్చారు. రేణుక కనుక టీడీపీలో చేరితే వచ్చేసారి ఆ సీటు ఆమెకే ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. టీడీపీలో ఆమె చేరికతో ఆ పార్టీలో చేరిన వైసీపీ ఎంపీల సంఖ్య మూడుకు చేరుకుంటుంది.  

జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుక గత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె భర్త నీలకంఠం టీడీపీలో చేరినా ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు.

More Telugu News