PV sindhu: పీవీ సింధూ ఘన విజయం... ఒకుహరాపై ప్రతీకారం తీర్చుకున్న తెలుగు తేజం!

  • 22-20, 11-21, 21-18 తేడాతో ఘన విజయం
  • ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధూ
  • గంటకు పైగా హోరాహోరీగా సాగిన పోరు

సియోల్ లో జరుగుతున్న విక్టర్ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో తెలుగుతేజం పీవీ సింధూ, జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై విజయం సాధించింది. తొలి సెట్ ను 22-20 తేడాతో గెలిచిన పీవీ సింధు, రెండో సెట్ ను 11-21 తేడాతో ఓడిపోయి, కీలకమైన మూడో సెట్ లో పుంజుకుంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ, ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధూ, మూడో సెట్ ను 21-18 తేడాతో గెలిచి, ఇటీవలి వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఒకుహరా చేతిలో తనకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.

మూడో సెట్ లో ఒకుహరా చేసిన తప్పిదాలనే తనకు అనుకూలంగా మలచుకున్న సింధూ, తన కెరీర్ లో మరో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సెట్ లో సింధూ 18-16 తేడాతో లీడింగ్ లో ఉన్న వేళ, 56 షాట్ల ర్యాలీ జరుగగా, కీలక పాయింట్ సింధూ ఖాతాలో చేరి ఆమెకు 19వ పాయింట్ ను అందించింది. అదే ఉత్సాహంతో సింధూ మ్యాచ్ ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఒకుహరా, సింధూకు అభినందనలు తెలిపింది. ఈ మ్యాచ్ ఒక గంటా 23 నిమిషాల పాటు సాగింది. సింధూ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూస్తున్న భారత అభిమానులు ఆఖరి పాయింట్ సాధించగానే హర్షధ్వానాలు చేశారు. ఆమె గెలుపుపై భారత క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News