: అద్భుతాలు జరిగితే తప్ప ఫైనల్ లో ఆడేవి ఈ జట్లే!

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో గత ట్రోఫీలో ఫైనల్ ఆడిన జట్లే ఈసారి కూడా ఫైనల్ ఆడనున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశ పోటీలు ముగిశాయి. లీగ్ దశలో నాలుగేసి పాయింట్లు సంపాదించిన ఇంగ్లండ్, బంగ్లాదేశ్ గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్ చేరగా, గ్రూప్ బి నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీస్ లో చోటు సంపాదించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14న తొలి సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ తో పాకిస్థాన్ తలపడనుండగా, 15న భారత్ తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ మ్యాచ్ లలో ఏవో అద్భుతాలు జరిగితే తప్ప ఇంగ్లండ్, భారత్ లను అడ్డుకోవడం ఆ రెండు జట్లకు సాధ్యం కాదు. గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్, ఇంగ్లండ్ తలపడగా, భారత్ విజేతగా ఆవిర్భవించింది. ఈసారి కూడా ఈ రెండు జట్లే ఫైనల్ లో తలపడనున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

టోర్నీ నిర్వహిస్తున్న దేశమైన ఇంగ్లండ్ ఫైనల్ చేరితే ఫైనల్ పై ఆసక్తి నెలకొంటుంది. అలా కాకుండా ఫైనల్ లో భారత్, పాక్ లు తలపడితే ఆ మ్యాచ్ మరింత ఆదరణకు నోచుకుంటుంది. ఈ నేపథ్యంలో సెమీస్ తో పాటు ఫైనల్ కూడా ఆసక్తికరంగా మారింది. ఏమాత్రం అంచనాలు లేకుండా, వెస్టిండీస్ పేలవ ప్రదర్శనతో సెమీస్ వరకు దూసుకొచ్చిన బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. గతంలో టీమిండియాకు ఆ జట్టు పలు సందర్భాల్లో షాక్ ఇచ్చింది. అంతే కాకుండా టీమిండియా ఆటగాళ్ల ఆటతీరుపై ఆ జట్టుకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేసినా టీమిండియాకు షాక్ ఖాయం.

More Telugu News