: మహానాడు కోసం ముందే రిజర్వ్.. విశాఖలో హోటళ్లు ఫుల్!

విశాఖపట్టణంలో ఈనెల 27 నుంచి 29 వరకు టీడీపీ మహానాడు జరగనుండడంతో నగరంలోని హోటళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మహానాడుకు తరలిరానున్న నాయకుల కోసం ప్రముఖ స్టార్ హోటళ్లలోని గదులన్నింటినీ ఇప్పటికే బుక్ చేశారు. దీంతో నగరానికి వచ్చే పర్యాటకులు, వ్యాపారవేత్తలు, పెళ్లి బృందాలకు హోటళ్లు దొరకడం గగనంగా మారింది. మహానాడుకు 30 వేలమంది హాజరుకానున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు.  

నగరంలో 22 స్టార్ హోటళ్లు, 250 చిన్న హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పొలిట్ బ్యూరో సభ్యుల కోసం ఇప్పటికే స్టార్ హోటళ్లలో 550 సూట్‌లు, గదులు బుక్ చేశారు. ఆ తర్వాతి స్థాయి నాయకులకు మరికొన్ని హోటళ్లలో గదులు రిజర్వ్ చేశారు. వారి అనుచరుల కోసం లాడ్జీలలో గదులను బుక్ చేశారు. ఇక కార్యకర్తల కోసం కళాశాలలు, రెసిడెన్షియల్ కాలేజీలు, కల్యాణ మండపాలను తీసుకున్నారు. ఇలా కనిపించిన మొత్తం అన్నింటినీ ముందస్తుగానే బుక్ చేసి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే నాయకుల కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల హాస్టళ్లను కేటాయిస్తున్నట్టు మంత్రి గంటా పేర్కొన్నారు. అయితే నగరానికి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే తమకు కొన్ని గదులు కేటాయించాలని హోటళ్లను కోరినట్టు మంత్రి తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. హోటళ్లలో గదులు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయాల కోసం తిరుగుతున్నారు.

More Telugu News