: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను విమర్శిస్తూ సొంత రాష్ట్రంలో పోస్టర్లు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు సాయంత్రం పటీదార్ వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, అమిత్ షాతో పాటు 43 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సన్మానించనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా, బీజేపీ ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తూ పోస్టర్లు వెలిశాయి. పటీదార్ వర్గానికి చెందిన వాళ్లే ఈ పోస్టర్లను అంటించడం గమనార్హం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జలియన్ వాలా బాగ్ మారణహోమానికి కారకుడైన బ్రిటిష్ జనరల్ డయ్యర్ తో అమిత్ షాను పోల్చుతూ ఈ పోస్టర్లు వేశారు. పటీదార్ తల్లులు, చెల్లెళ్లను అమిత్ షా అవమానించారని ఆరోపిస్తూ, రాష్ట్రంలోని పటీదార్ ఎమ్మెల్యేలు ఎందుకూ పనికిరారంటూ కూడా కొన్ని పోస్టర్లు దర్శనమిచ్చాయి. కాగా, గతంలో నిర్వహించిన పటీదార్ ఉద్యమంలో కొన్ని వందల మంది గాయపడగా, తొమ్మిది మంది చనిపోయారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ను జనరల్ డయ్యర్ తో పోలిస్తూ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ విమర్శించారు.

More Telugu News