వృశ్చిక సంక్రమణం ప్రత్యేకత

వృశ్చిక సంక్రమణం ప్రత్యేకత
కార్తీకమాసంలో ఇటు శివాలయాలు ... అటు వైష్ణవ ఆలయాలు భక్తులతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. కార్తీకంలో నదీ స్నానం ఎంతో పవిత్రమైనదని చెప్పబడింది కనుక, ముఖ్యంగా నదీ తీరంలో గల ఆలయాలలో భక్తుల రద్దీ బాగా వుంటుంది. ఉదయాన్నే చన్నీటి స్నానాలు ... దీపారాధనలు ... నోములు ... వ్రతాలు ... ఉపవాసాలు ... దీపదానాలతో ఈ మాసమంతా సందడిగా గడిచిపోతుంది.

కార్తీకమాసం తొలిరోజు నుంచి ముగింపు వరకూ ప్రతిరోజూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని పవిత్రతను ఆవిష్కరిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ పేరుతో కోటి దీపాల కాంతుల మధ్య కార్తీకమాసాన్ని ఆహ్వానించినట్టు అవుతుంది. 'బలిపాడ్యమి' ... 'భగినీహస్త భోజనం' ... 'నాగుల చవితి' ... 'ప్రబోధన ఏకాదశి' ... 'క్షీరాబ్ది ద్వాదశి' ... 'వైకుంఠ చతుర్దశి' తరువాత 'వృశ్చిక సంక్రమణం' మొదలవుతుంది.

ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి ప్రతి మాసంలోను ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉండటాన్ని 'సంక్రమణం' అంటారు. ఈ నేపథ్యంలో సూర్యభగవానుడు 'తులారాశి' నుంచి 'వృశ్చికరాశి' లోకి ప్రవేశించడాన్ని వృశ్చిక సంక్రమణమని అంటారు. ఇక ఈ వృశ్చిక సంక్రమణం కూడా ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడింది.

ఈ సంక్రమణ సమయంలో చేసే నదీ స్నానము ... జపము ... ధ్యానము ... దానము విశేషమైనటు వంటి పుణ్యఫలాలను ఇస్తాయి. ఈ రోజున చేసే పూజల వలన సమస్త దోషాలతో పాటుగా దారిద్ర్యం కూడా నశించి సంపదలు లభిస్తాయని చెప్పబడింది.

More Bhakti Articles