కరుణచూపే కట్టమైసమ్మ

కరుణచూపే కట్టమైసమ్మ
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు తమని బిడ్డలుగా భావించి కాపాడుతూ ఉంటుందని గ్రామీణ ప్రాంత ప్రజలు విశ్వసిస్తూ వుంటారు. తమని కంటికి రెప్పలా కాపాడే ఆ తల్లిని, తమ ఇలవేల్పుగా ఆరాధిస్తుంటారు. గ్రామదేవతల పట్ల అక్కడి ప్రజలు విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఈ కారణంగానే ఆ ఊరు నుంచి అత్తవారింటికి వెళ్లిన అమ్మాయిలు, పండగలకి .. పర్వదినాలకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ తల్లికి కనిపించి వెళుతుంటారు.

తమ గ్రామానికి చెందిన ఆడపిల్లలు ఎక్కడ ఉంటున్నా అమ్మవారు ఓ కంట కనిపెడుతూనే వుంటుంది. ఈ అనుబంధం కారణంగానే ఈనాటికీ గ్రామదేవతల ఆలయాలు వైభవంగా వెలుగొందుతున్నాయి. అలాంటి ఆలయాలలో హైదరాబాద్ - బేగంపేటకి చెందిన 'శ్రీ కట్టమైసమ్మ ఆలయం' ఒకటి. అమ్మవారి ఆదేశం మేరకు ఓ భక్తుడు నిర్మించిన ఈ ఆలయం, అనతికాలంలోనే విశేషమైన ఆదరణను సంపాదించుకోగలిగింది.

కామధేనువులా ... కల్పవృక్షంలా కోరిన వరాలను ప్రసాదిస్తూ వుండటం వలన ఇది పుణ్యక్షేత్రాలను తలపిస్తూ వుంటుంది. వివిధ రూపాల్లో అమ్మవారి ప్రతిమలు మలచబడిన గోపురం ... ప్రాకారాలు ... ముఖమంటపం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటాయి.

గర్భాలయంలో అమ్మవారు పసుపు అద్దబడిన మోముతో ... విశాల నేత్రాలతో ... నాగపడగలు గల కిరీటం ధరించి వుంటుంది. మంగళ ... శుక్ర ... ఆదివారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కరుణచూపే కట్ట మైసమ్మతల్లిని దర్శించుకోవడం వలన, సకలశుభాలు చేకూరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles