మందపల్లి శ్రీ చక్రం

మందపల్లి శ్రీ చక్రం
దేవతలతో ... మహర్షులతో నిత్యం ఆరాధించబడుతోన్న అమ్మవారు అనేక ప్రాంతాలలో ఆవిర్భవించి, మానవాళిని అమ్మగా అనుగ్రహిస్తోంది. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు శ్రీ చక్రంలో కొలువై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి చక్రం ... స్థితి చక్రం ... సంహార చక్రం ... అనే మూడింటిని 'త్రిపుర' అంటారు. ఆ తల్లియే త్రిపురసుందరీ దేవిగా ఆరాధించబడుతోంది.

సాధారణంగా అమ్మవారి ఆలయాల్లో శ్రీ చక్రమేరు వుంటుంది. అత్యంత శక్తివంతమైన శ్రీ చక్రానికి కుంకుమ పూజలు చేయించడం వలన సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని స్త్రీలు విశ్వసిస్తూ వుంటారు. శ్రీ చక్రం గల ఆలయాలను దర్శించడం వలన సమస్త దోషాలు నశించి, సకల సంపదలు కలుగుతాయని చెబుతుంటారు. అలాంటిది శ్రీ చక్రమే ఆలయంగా గల క్షేత్రాన్ని దర్శించడం వలన ఎంతటి పుణ్యఫలాలను పొందవచ్చనేది ఊహించవచ్చు.

అలా శ్రీచక్రమే ప్రధానంగా గల ఆలయం తూర్పు గోదావరి జిల్లా 'మందపల్లి'లో విలసిల్లుతోంది. శ్రీచక్రమేరు విశిష్టతను పరిశీలించి ... పరిశోధించి, ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం వెనుక 'ప్రణవానంద' అనే భక్తుడి కృషి ఎంతగానో వుందని స్థానికులు చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో ఆయన మందిరం కూడా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయములో శ్రీ చక్రమేరు ప్రతిష్ఠించబడి వుంటుంది. గర్భాలయ విమానం కూడా శ్రీ చక్రమేరుగా నిర్మించడం ఇక్కడి విశేషం.

నల్లరాయితో మలచబడిన ఈ శ్రీ చక్రాన్ని అంతా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. ప్రతి శుక్రవారం శ్రీచక్రమేరుకి అభిషేకం ... ప్రత్యేక అలంకరణ చేస్తుంటారు. ఇక విశేషమైన పుణ్య తిథుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగానే వుంటుంది.

More Bhakti Articles