గరుడ పురాణం చదవకూడదా?

గరుడ పురాణం చదవకూడదా?
అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో ప్రాధాన్యత వుంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా ... ఆసక్తిగా గరుడపురాణం చదవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడపురాణం పట్ల వారికి గల అపోహేనని చెప్పవచ్చు.

ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం ... జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ... కొన్ని కుటుంబాల్లో శ్రార్ధ సమయాల్లో గరుడ పురాణం చదవడం ఆనవాయతీగా వస్తోంది.

ఇలాంటి సందర్భాల్లో గరుడపురాణం చదవడం వలన చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఉత్తమగతులు కలగడానికి తాము చేయవలసిన విధుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అంతే కాకుండా తాము ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు కూడా బోధపడతాయి. నిజానికి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినవే. అయితే ఎవరైనా చనిపోయినప్పుడు గరుడపురాణం చదవాలనే విషయాన్ని అంతా పక్కనపెట్టేశారు. గరుడపురాణం చదవడం వలన ఎవరైనా పోతరేమోననే సందేహమే ఎక్కువగా ప్రచారాన్ని సంతరించుకుంది.

ఈ కారణంగానే 'గరుడ పురాణం' ఎవరి ఇంట్లో కనిపించకుండా పోయింది ... ఎవరి నోటా వినిపించకుండా పోయింది. పరలోకంలో ఆత్మగా జీవుడు కొనసాగించే యాత్ర గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే వ్యాసభగవానుడు దానిని రచించాడు కనుక, నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవవచ్చని పండితులు తేల్చిచెబుతున్నారు.

More Bhakti Articles