త్రేతాయుగ గణపతి క్షేత్రం

త్రేతాయుగ గణపతి క్షేత్రం
తమిళనాడు ప్రాంతంలో కుమారస్వామి క్షేత్రాలతో పాటు వినాయకుడి క్షేత్రాలు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. వీటిలో చాలా వరకూ పురాణపరమైన ... చారిత్రకపరమైన నేపథ్యాన్ని కలిగి వున్నవే. అలాంటి ప్రత్యేకతను ... విశిష్టతను కలిగివున్న క్షేత్రం 'తిరుచిరాపల్లి'లో దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామి త్రేతాయుగానికి చెందినవాడుగా పురాణాలనుబట్టి తెలుస్తోంది.

త్రేతాయుగంలో రావణవధ అనంతరం ఆ రాజ్యానికి విభీషణుడిని రాజును చేసి శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నాడు. అయితే శ్రీరామచంద్రుడి ఎడబాటును విభీషణుడు భరించలేకపోతాడు. శ్రీరాముడిని కలుసుకుని ఆయన మూర్తిని తనకి ఇవ్వవలసినదిగా కోరతాడు. దాంతో శ్రీరాముడు ఆయనకి శ్రీమహావిష్ణువు ప్రతిమను అందజేస్తాడు. ఆ ప్రతిమను పూజిస్తే తనని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెబుతాడు.

లంకా పట్టణానికి చేరుకునేంత వరకూ ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్రతిమను నేలపై పెట్టకూడదనీ, అదే జరిగితే ఇక ఆ ప్రతిమను లేవనెత్తడం ఎవరివలన కాదని శ్రీ రాముడు అనడంతో, జాగ్రత్తగా ఆ ప్రతిమను చూసుకుంటూ విభీషణుడు తన పట్టణానికి బయలుదేరతాడు. అత్యంత శక్తిమంతమైన ... పవిత్రమైన శ్రీమహావిష్ణువు ప్రతిమ ఎలాంటి పరిస్థితుల్లోను రాక్షస భూమికి చేరరాదని నారదుడు భావిస్తాడు.

గతంలో రావణాసురుడు శివుడి ఆత్మలింగం తీసుకువెళుతుండగా వినాయకుడితో కలిసి ఎలాంటి పథకం వేశాడో, అదే పథకాన్ని ఇక్కడ కూడా ఆచరణలో పెడతాడు. ఫలితంగా శ్రీమహావిష్ణువు ప్రతిమ నేలపై పెట్టబడుతుంది. అందుకు కారణమైన కుర్రవాడి కోసం విభీషణుడు ఆవేశంతో వెదుకుతూ వుండగా, ఓ కొండపై వినాయకుడు తన నిజరూపంతో ఆయనకి దర్శనమిస్తూ స్వయంభువుగా వెలిశాడు. దాంతో విభీషణుడు స్వామిని పూజించి వెళ్లినట్టు స్థలపురాణం చెబుతోంది.

ఆ తరువాత ద్వాపరయుగంలోనూ ఎంతోమంది మహనీయులు స్వామివారిని దర్శించి ... సేవించి ... తరించారు. ఇక కలియుగంలో స్వామివారి ఉనికి బయటపడి కొన్నివందల సంవత్సరాలు అవుతోంది. ఇక్కడి స్వామిని పూజించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి, సకల సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles