పాండురంగడి అనుగ్రహం

పాండురంగడి అనుగ్రహం
పాండురంగడినే తన సర్వస్వంగా భావించిన తుకారాం, తన సమస్త సంపదలను దానధర్మాలకు ధారపోశాడు. చివరికి ఇల్లు గడవడానికి తానే ఏదో ఒక పని వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. పాండురంగడిని ధ్యానించడం మినహా ఆయన ఎవరినీ ఏదీ యాచించడని ఆ గ్రామస్తులకు తెలుసు. సహాయం చేద్దామంటే ఆయన స్వీకరించడనీ తెలుసు. ఈ కారణంగానే ఏదో ఒక సాకు చెప్పి ఆయన ఇంటికి ధాన్యం చేర్చే వారు.

భగవంతుడు ఏది ఇచ్చినా అది అందరితో కలిసి పంచుకోవాలని తుకారాం భావించేవాడు. ఈ కారణంగానే ఆయన తనకి లభించినది ఏదైనా వెంటనే మిగతావారికి పంచిపెట్టేవాడు. ఒకసారి ఒకరైతు తన జోన్నపంట అధిక దిగుబడిని ఇవ్వడానికి తుకారాం కారణమంటూ, అందుకు కృతజ్ఞతగా ఆయన ఇంటికి జొన్న బస్తాలను తరలించాడు. లోపల కూర్చుని తుకారాం భార్య ఆ జొన్నలను విసురుతుండగా, బయటనుంచే ఆయన ఆ ధాన్యాన్ని అందరికీ పంచేశాడు.

చివరిగా జోలె పట్టుకుని ఆ పాండురంగడు మారువేషంలో వచ్చి నుంచున్నాడు. అప్పటికే ధాన్యం అయిపోవడంతో, భార్య విసిరిన పిండిని ఆయనకు దానంగా ఇచ్చేశాడు తుకారాం . పిల్లలు తినడానికి ఆ పూటకి ఇక ఏమీ లేదని తెలిసినా, ఆయన భార్య తుకారాం తీరును మౌనంగా చూస్తుండిపోయింది.

మారువేషంలో వచ్చిన పాండురంగడు వెళ్లి పోయిన తరువాత, ఆమె నిరాశా నిస్పృహలతో ఇంట్లోకి వెళ్లింది. ఒక గదిలో జొన్నపిండి రాసులుగా పోసి వుండటం చూసి ఆశ్చర్యపోయింది. భర్తను పిలిచి ఆ విచిత్రాన్ని చూపించింది. అదంతా పాండురంగడి అనుగ్రహమంటూ ఆ స్వామికి తుకారాం కృతజ్ఞతలు తెలియజేశాడు.

More Bhakti Articles