కలశంపై కొబ్బరి కాయ ?

సాధారణంగా ఇళ్లలో చేసుకునే నోములు - వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లోనూ, దేవాలయాల్లో జరిగే దైవ కార్యాలలోను కలశారాధన జరుగుతూ వుంటుంది. రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు - కుంకుమలు పెడతారు. ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షింతలు ... పసుపు - కుంకుమలు .. గంధం ... పూలు వేస్తారు.

కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వాటి పై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు. ఇక పూజ అయిన తరువాత ఈ కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలా మందికి కలుగుతూ వుంటుంది. అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరి కాయలను 'పూర్ణాహుతి' కి వాడుతుంటారు. ఇళ్లలో ఆ అవకాశం వుండనందు వలన ఆ కొబ్బరి కాయను ఏం చేస్తే ఏం దోషం వస్తుందో అని చాలా మంది కంగారు పడుతుంటారు.

అయితే కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ అది కష్టమైతే దగ్గరలోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చని అంటోంది. లేదంటే నోములు - వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ వుంటారు గనుక, వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని శాస్త్రం చెబుతోంది.


More Bhakti News