మానసిక పూజ

మానసిక పూజ
పూజలన్నింటిలో మానసిక పూజ ఉత్తమమైనదని పురాణాలు చెబుతున్నాయి. 'అహింస' ... 'దయ'... 'క్షమ'... 'ధ్యానం'... 'జ్ఞానం'... 'సత్యం'... 'ఇంద్రియ నిగ్రహం' ...'తపస్సు' ఇవన్నీ కూడా భగవంతుడికి భక్తుడు సమర్పించే 'మానసిక పుష్పాలు'గా చెప్పబడుతున్నాయి. బాహ్యంగా పూజల పేరుతో చేసే హడావిడి వలన ప్రయోజనం తక్కువ. అంతరంగికంగా చేసే మానసిక పూజ మాత్రమే త్వరిత గతిన మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణ పురుషులెందరో చెప్పారు.

ఇక మానసిక పూజలే కాదు ... మనసులోనే ఆలయ నిర్మాణాలు చేపట్టిన భక్తులు కూడా లేకపోలేదు. పూర్వం ఓ పేద బ్రాహ్మణుడు శివాలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. కానీ ఎవరూ ధన సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో, మనసులోనే మహా దేవుడికి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించుకున్నాడు. ప్రతి రోజు ధ్యానంలో కూర్చుని ఆలయ నిర్మాణానికి అవసరమైన సామాగ్రి తెచ్చినట్టు ... పనులు జరుగుతున్నట్టు ... పైకప్పు వేస్తున్నట్టు ఇలా మనసులోనే అనుకుంటూ రాసాగాడు.

అలా కొంతకాలానికి ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో, మంచి ముహూర్తం నిర్ణయించుకుని ప్రతిష్ఠ సమయం శివుడికి చెప్పుకున్నాడు. అదే సమయంలో ఆ దేశపు రాజుగారు కూడా శివయ్యకి లక్షలాది రూపాయలతో ఓ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ సమయాన్ని నిర్ణయించాడు. అంతకుముందు రోజు రాజుగారి కలలోకి శివుడు వచ్చి, అదే ముహూర్తంలో ఫలానా బ్రాహ్మణుడు ప్రతిష్ఠ పెట్టుకున్నాడనీ, తాను అక్కడికి వెళ్లవలసి వుందని చెప్పాడు. రాజుగారి ఆలయంలోని ప్రతిష్ఠను వాయిదా వేసుకోమని చెప్పి అదృశ్య మయ్యాడు.

దాంతో ఆ బ్రాహ్మణ భక్తుడిని ... ఆయన నిర్మించిన ఆలయాన్ని చూడటానికి రాజుగారు బయలుదేరాడు. బ్రాహ్మణుడిని కలుసుకుని తనకి వచ్చిన కల గురించి చెప్పి, ఆయన నిర్మించిన ఆలయం చూపించమని కోరాడు. తన మనసులోనే ఆలయ నిర్మాణం చేసినట్టు ఆ బ్రాహ్మణుడు చెప్పడంతో, అతని భక్తికి ఆశ్చర్యపోతూ ఆ రాజు సాష్టాంగ నమస్కారం చేశాడు.

More Bhakti Articles