పరమేశ్వరుడే సిద్ధుడిగా వచ్చిన వేళ

పరమేశ్వరుడే సిద్ధుడిగా వచ్చిన వేళ

పూర్వం 'మధురై'ను అభిషేక పాండ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తాను చాలా గొప్పవాడిననీ .. మధురై ప్రజలను పోషిస్తున్నది తానేననే అహంభావం ఆయనలో ఉండేది. ఒక రోజున ఆయన మీనాక్షి దేవాలయానికి వెళతాడు. ఆ సమయంలోనే ఆయనకి అక్కడ ఒక సిద్ధుడు కనిపిస్తాడు. తన వలన సాయమేదైనా కావాలంటే అడగమని రాజు ఆ సిద్ధుడితో అంటాడు. తనకి ఎవరూ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, మధురై ప్రజలకు కావలసినదేమిటో తానే ఇవ్వాలనుకుంటున్నానని ఆ సిద్ధుడు సమాధానమిస్తాడు.

రాజు అహం దెబ్బతినడంతో, ఆ సిద్ధుడి శక్తిని పరీక్షించాలనుకుంటాడు. భటుడిని పిలిచి చెరుకు గడ ఒకటి తీసుకురమ్మని చెబుతాడు. ఆ భటుడు తీసుకొచ్చిన చెరుకు గడను సిద్ధుడికి ఇచ్చి, అక్కడున్న రాతి ఏనుగుతో ఆ చెరుకును తినిపించమని అంటాడు. ఆ సిద్ధుడు చెరుకు గడను రాతి ఏనుగు ముందుంచగానే ఆ ఏనుగులో కదలిక మొదలవుతుంది. ప్రాణం పోసుకున్న ఆ రాతి ఏనుగు చెరుకును తినేస్తుంది. అది చూసిన రాజు ఆశ్చర్యపోయి .. తనని మన్నించమని కోరతాడు. అప్పుడు  ఆ సిద్ధుడు పరమేశ్వరుడిగా నిజరూపాన్ని పొందుతాడు. రాజులోని అహంభావాన్ని తొలగించడానికే అలా చేశానని చెప్పి అదృశ్యమవుతాడు.            

More Bhakti Articles