సత్యాన్ని మాత్రమే పలికించే సత్యస్తంభం

సత్యాన్ని మాత్రమే పలికించే సత్యస్తంభం

సత్యాన్ని మాత్రమే పలికించే సత్యస్తంభం
పూర్వకాలంలో ప్రతి గ్రామానికి ఒక కట్టుబాటు ఉండేది. అందరూ దానికి తగినట్టుగా నడచుకునేవారు. ఎవరైనా సరే అవినీతికి .. అన్యాయానికి ... మోసానికి పాల్పడితే శిక్షలు కఠినంగా ఉండేవి. అయితే ఈ సత్య పరీక్షలు జరిపే ప్రదేశంగా ... శిక్షను అమలుపరిచే ప్రదేశంగా ఆ గ్రామ ఆలయ ప్రాంగణమే కనిపిస్తూ ఉంటుంది.

భగవంతుడి సన్నిధిలో అసత్యం చెప్పడానికి ఎవరైనా సరే భయపడతారనీ, అదే భగవంతుడికి భయపడి గ్రామపెద్దలు సరైన తీర్పు చెబుతారనే ఉద్దేశంతోనే పూర్వీకులు ఈ విధమైన ఏర్పాటును చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నేటికీ కొన్ని క్షేత్రాల్లో సత్య నిరూపణలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి క్షేత్రాల్లో కృష్ణా జిల్లాకి చెందిన 'పెదకళ్ళేపల్లి' ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది.

'శ్రీదుర్గానాగేశ్వరస్వామి' ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో ప్రాచీనకాలం నాటి 'సత్యస్తంభం' ఒకటి కనిపిస్తుంది. వివిధ విషయాలకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న వాళ్లు, తమపై పడినది నిందేననీ ... నిజంకాదని ఈ సత్య స్తంభాన్ని తాకి ప్రమాణం చేయవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ఈ సత్య స్తంభాన్ని తాకిన వారు దాని ప్రభావం వలన ... శివయ్య భయం వలన అసత్యమాడరట. అలా అసత్యం చెప్పడానికి ప్రయత్నించిన వాళ్లు దేవుడి ఆగ్రహానికి గురై ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతుంటారు.

గతంలో కొందరికి జరిగిన ఈ రకమైన అనుభవాలను గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ అనుభవాలే ఆ తరువాత తరాలవారికి పాఠాలుగా పనిచేస్తున్నాయి. పరమశివుడికి ప్రతిరూపంగా ... పవిత్రమైనదిగా చెప్పుకునే ఈ సత్య స్తంభానికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తుంటారు. మహిమాన్వితమైన ఈ సత్య స్తంభాన్ని దర్శించిన తరువాతనే ప్రధాన దైవాన్ని పూజించడానికి వెళుతుంటారు. ఈ గ్రామానికి సంబంధించిన వివాదాస్పద విషయాలన్నీ కూడా ఇక్కడే పరిష్కరించబడుతూ ఉండటం చూస్తే ఎవరికైనాసరే ఆశ్చర్యం కలగకమానదు.

More Bhakti Articles